ఒక్క దెబ్బతో KCR, బాబును ఇరుకున పెట్టిన జేసీ.. ఉమ్మడి రాష్ట్రాల్లో కాక రేపుతోన్న మాజీమంత్రి డిమాండ్!

by Disha Web Desk 19 |
ఒక్క దెబ్బతో KCR, బాబును ఇరుకున పెట్టిన జేసీ.. ఉమ్మడి రాష్ట్రాల్లో కాక రేపుతోన్న మాజీమంత్రి డిమాండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర విభజన నాటి పురుడు వాసన ఇంకా పోనేలేదు. అంతలోనే మరో డిమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. రాయల తెలంగాణ పేరుతో జేసీ దివాకర్ రెడ్డి కొత్త పల్లవి అందుకోవడం పొలిటికల్‌గా సెన్సేషనల్ అవుతోంది. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్లకు జేసీ దివాకర్ రెడ్డి ఈ తరహా డిమాండ్ చేయడం వెనుక అసలు రీజన్ ఏంటనే చర్చ తెలుగు రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్న వేళ బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న కేసీఆర్‌కు ఈ అంశం ఇప్పుడు పెద్ద సవాలుగా మారబోతోందా? లేక కలిసి రాబోతోందా అనేది చర్చనీయాశంగా మారింది.

రాయల తెలంగాణ డిమాండ్ మిగతా వారు ఎవరు చేసినా దానికి ఇంతటి ప్రాధాన్యత ఉండేది కాదేమో. కానీ ఈ డిమాండ్ చేసింది తెలుగు రాజకీయాల్లో కాకలు తీరిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కావడంతో ఆసక్తి పెరిగింది. జేసీ తాజా డిమాండ్ వెనుక ఏదైనా పొలిటికల్ ట్విస్ట్ ఉందా అనేది అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పార్టీల మధ్య పొత్తు అంశం హాట్ హాట్‌గా సాగుతున్నది.

బీజేపీ, జనసేన ఏకం అవుతుంటే టీడీపీ తో కలిసి వచ్చేదెవరనేది సందేహంగా మారుతున్నది. ఈ క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి కేసీఆర్ ప్రణాళికలు రచించడంతో చర్చనీయాంశం అవుతున్నది. జేసీ దివాకర్ డిమాండ్‌పై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతోందనే దానిపై ఏపీలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బీఆర్ఎస్‌కు ప్రజలు స్వాగతించడమో లేక విమర్శించడమో ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజనకు కారకుడనే ముద్ర కేసీఆర్‌పై ఉండగా ఈసారి మాత్రం కలిపేందుకు కేసీఆర్ చొరవ తీసుకోవాలని జేసీ కోరడం గమనార్హం.

అయితే జేసీ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రాయల తెలంగాణ అంశంపై బీఆర్ఎస్ మంత్రి తలసాని స్పందిస్తూ ఈ అంశంపై నేతలు కాదు ప్రజలు పోరాడితే అప్పుడు చూద్దామని, అసలు ఈ విషయంలో జేసీ కాదు వారి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన అభిప్రాయం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ పేరుతో ఏపీలో అడుగు పెట్టాలని చూస్తున్న కేసీఆర్‌కు జేసీ వ్యాఖ్యల రూపంలో చంద్రబాబు చెక్ పెట్టించారనే ఓ వాదన వినిపిస్తోంది.

మరో వైపు అనూహ్యంగా జేసి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రబాబును ఇరుకున పెట్టడమే జేసీ ఉద్దేశం అయి ఉంటుందనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. జేసీ తనయుడు పవన్ కుమార్ రెడ్డి అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇదే ప్రతిపాదనను జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధిష్టానం ముందు ఉంచారని సమాచారం.

అయితే అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉండటంతో వారిని కాదని జేసీ ఫ్యామిలీకి టికెట్ ఇవ్వడం కుదరదని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పడంతో అప్పటి నుంచి చంద్రబాబుపై జేసీ అసంతృప్తితో ఉన్నారని అందులో భాగంగానే చంద్రబాబును ఇరకాటంలో పెట్టడంలో భాగంగా కూడా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా జేసీ వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నా ఈ డిమాండ్ ఎన్నికల ముంగిట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ అంశం మరింత పొలిటికల్ టర్న్ తీసుకుంటే తెలుగు రాజకీయల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారింది.

Also Read..

రైతులను ఆదుకోండి.. సీఎస్ డా.కేఎస్ జవహర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు లేఖ


Next Story

Most Viewed